Monthly Archives: December 2019

బానిసత్యం నుండి భారతీయత వైపు

ఆంగ్లంలోని ప్రతి పదాన్ని కష్టపడి తెలుగులోకి తర్జుమా చేసుకుని నేర్చుకోవటం కంటే, నేరుగా ఆంగ్లంలో నేర్చుకోవటం సులువు కదా అని ఈ మధ్య ఒక ఐఏఎస్ అయ్యవారు సెలవిచ్చారు ఒక దిన పత్రికలో. తరతరాలుగా ఇంగ్లీషు వాడు ఏది చెప్తే అదే శాస్త్రంలా గుడ్డిగా చదువుకోవటానికి అలవాటు పడి, ప్రతి విషయంలోనూ ఇంగ్లీషు వాడిని అనుకరించటానికి అలవాటు పడి స్వంత బుద్ధి, సృజనాత్మకత కోల్పోయి మన సమాజం దాదాపు నిర్విర్వం అయిపోయిందంటానికి అయ్యవారి మాటలే తార్కాణం.

ఇంగ్లీషు వాడి నోట్లోనుండి ఊడిపడిన ప్రతి మాటని తెలుగులోకి తర్జుమా చేసుకుని నేర్చుకోవలసిన ఖర్మ నిజంగా తెలుగు జాతికి లేదు. తెలుగు వాళ్ళందరూ నిజంగా అంత బుర్రలేని వాళ్ళు కాదు ప్రతి ఇంగ్లీషు పదాన్ని అనువదించుకుని, దాన్ని కంఠస్థం చేసి, భాష్యం చెప్పుకోవటానికి. ఒకవేళ నిజంగా ఒక మంచి విషయం ఏదైనా ఇంగ్లీషు వాడు చెప్పాడంటే, దాన్ని అలానే మనం తీసుకోవచ్చు, ప్రతి పదాన్ని కష్టపడి తెలుగులోకి తర్జుమా చేసుకోవలసిన పని లేదు. మనం అందించిన యోగ అనే పదాన్ని ఇంగ్లీషువాడు అలానే వాడుకుంటుంటున్నాడు. వాడు ప్రత్యేకంగా దానికి ఒక పదాన్ని సృష్టించుకోలేదు. మనం కూడా అలానే చేయవచ్చు. అంతేకాని ప్రతిదానికి లేనిపోని కొత్త పదాల్ని తయారు చేసుకుని, గందరగోళం సృష్టించవలసిన పనిలేదు.

నిజానికి, ఈ ఆధునిక యుగంలో మానవాళికి అత్యంత మేలు చేకూర్చే సాధనం ఏదైనా ఈ ప్రపంచం తెలుసుకుంది అంటే అది యోగ మాత్రమే. అంతేకాని సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, రాకెట్లు, లేదా ఇంగ్లీషు మందులు కాదు. ఈ విషయంలో నిజంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభినందనీయులు. అదీ భారతీయ సంస్కృతి, భారతీయ వాజ్మయం యొక్క గొప్పతనం. యోగ లాంటి ఎన్నో అద్భుతమైన అంశాలు, మానవాళికి మేలు చేసే ఎన్నో సూత్రాలు మన ప్రాచీన వాజ్మయంలో ఉన్నాయి. మనం ప్రత్యేకంగా కొత్తగా ఆవిష్కరించవలసింది గానీ, కొత్తగా ప్రతిపాదించవలసింది కానీ ఏమి లేవు, మనకు కావాల్సిన శాస్త్రజ్ఞానమంతా అందులో నిబిడీకృతమై ఉన్నది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిజంగా జ్ఞాన సముపార్జనకు ఇంగ్లీషు భాష అవసరం లేదు. కానీ దురదృష్ట వశాత్తు, ఇంగ్లీషు చదువుల మోజులో పడి కొట్టుకుపోతున్న మనకు మన శాస్త్రాలను చదివే సమయం లేదు. వాటి గురించి కనీస అవగాహన లేదు, వాటిని అర్ధం చేసుకోవటానికి కావాల్సిన మేధాశక్తినీ, భాష నైపుణ్యాన్నీ కోల్పోయాం. ఇంకా, మన విలువైన ప్రాచీన వాఙ్మయాన్ని మత గ్రంధాలుగా ముద్ర వేసి, వాటిని విద్యార్థులు అధ్యయనం చేయటమే పాపమనుకునే దుస్థితికి మన విద్యావ్యవస్థను దిగజార్చారు మన స్వార్ధ రాజకీయ నాయకులు, కుహనా లౌకికవాదులు మరియు కుహనా హేతువాదులు.

మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవటమే కానీ మన పాలకులకు, ప్రజలకు ఇంకా బానిస మనస్తత్వం పోలేదు. మన దేశాన్ని ఇంకా ఇంగ్లీషు ప్రభువులే పరోక్షంగా పాలిస్తున్నారు. మన పాలకులు ఎప్పటికీ సామంత రాజులుగానే ఉంటారనిపిస్తుంది, ప్రజలను కూడా బానిసలుగానే ఉంచుతున్నారనిపిస్తుంది. మన రాజ్యాంగం పాశ్చాత్యుల నుండి దిగుమతి చేసుకోబడింది, మన చట్టాలు, వ్యవస్థలు అన్ని కూడా వాళ్ళ బిక్షే, పాశ్చాత్యుల నుండి మక్కికి మక్కి కాపీలే. మనకేది మంచిదో, మనమేం చేయాలో, మనమేం చదవాలో కూడా పాశ్చాత్యులను చూసి నిర్ణయించుకుంటాం, వేషభాషలన్నింటిలోను వారిని అనుకరించటానికి పోటీ పడతాం. పాశ్చాత్యం వైపు పరుగులు పెట్టే మనకు, పాశ్చాత్యులు ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ ని తలకెక్కిచుకోవటంలో తలమునకులైన మనకు మన శాస్త్రాలను చదివే సమయం ఉండదు, అనుకరణకు అలవాటు పడి, మేధాశక్తి నిర్విర్వం అయిన మనం మన సంస్కృతి, సంప్రదాయాలను, వాటి శాస్త్రీయతని ఎలా అర్ధం చేసుకోగలం? పాశ్చాత్యులను గుడ్డిగా అనుకరిస్తూ, మన సంస్కృతి సంప్రదాయాలను వెనుకబాటుతనంగా, మూఢనమ్మకాలుగా కొట్టి పడేసే స్థాయికి భారతీయ మేధస్సు ‘ఎదిగింది’!

వేదభూమి, కర్మభూమి, సనాతన ధర్మం పుట్టిన భూమి, విశ్వగురువుగా మనం పిలుచుకునే భారతదేశానికి ఇంతటి దుస్థితి ఎలా వచ్చింది? మనకు మన శాస్త్రాలు ఎం చెప్పాయో కూడా తెలుసుకోలేని ప్రభుద్ధులం ఎందుకయ్యాం? ఒక వైపు పాశ్చాత్యులను గుడ్డిగా అనుకరిస్తూ, మన సంస్కృతి సంప్రదాయాలను మూఢనమ్మకాలుగా కొట్టి పడేసే కుహనా హేతువాదులు; మరో వైపు పాశ్చాత్యులు ఏమైనా చెప్పగానే అది మాకు ఎప్పుడో తెలుసనీ, మా గ్రంధాల్లో ఎప్పుడో రాసారని, మా పూర్వికులు ఎప్పుడో చెప్పారని ఫోజులు కొట్టే మిధ్యా మేధావులు. పాశ్చాత్యులు భూమి గుండ్రంగా ఉందని చెప్తే మా పూర్వికులు ఎప్పుడో తేల్చారని డంబాలు పలుకుతారు, వాళ్ళు భూమి బల్లపరుపుగా ఉందని కొత్త సిద్ధాంతం ప్రవచిస్తే అదీ మా పూర్వికులు ఎప్పుడో నిర్ధారించారని గప్పాలు కొట్టుకుంటారు. ఇదీ ఇంగ్లీషు చదువులు చదువుకున్న ఆధునిక భారతీయుల యొక్క మానసిక పరిస్థితి. స్థిర చిత్తం లేదు. స్వంత ఆలోచనలు ఉండవు, సృజనాత్మకత లేదు, మన దృష్టిలో సృజనాత్మకత అంటే పాశ్చాత్యులు మనకు నేర్పిన వాటిని కొత్తగా చేయటం, వాటిని కొత్తగా అనుకరించటం.

భారతావనికి స్వతంత్రం రాకమునుపు ఈ దేశంలో రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, రవీంద్ర నాథ్ టాగోర్, శ్రీనివాస రామానుజన్, సీవీ రామన్, జగదీష్ చంద్రబోస్, యెల్లప్రెగ్గడ సుబ్బారావు, మహాత్మా గాంధీ… ఇలా చాలా మంది గొప్ప తత్వవేత్తలు, సైంటిస్టులు, ప్రపంచానికి దారి చూపించిన గొప్ప నాయకులు ఉన్నారు. అంతటి మేధావంతులు, ప్రపంచం మెచ్చే ఒక మంచి సందేశం ఇచ్చినవాళ్లు, ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు మరి ఈ డెబ్భై సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఎంతమంది ఉన్నారు? ఎందుకని భారతావనికి ఈ దౌర్భాగ్యం?

మనల్నిఇంతకుముందు ఇంగ్లుషు వాళ్ళు పాలించారు, కానీ అప్పుడు మన మనసులు స్వతంత్రంగా ఉండేవి, మన ఆలోచనల్లో ఒరిజినాలిటీ ఉండేది. ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిందికాని మన మనసులు బానిసలుగా అయ్యాయి. అవి ఇంగ్లీషు వాళ్ళకి లోబడి ఆలోచిస్తున్నాయి, ఆలోచనలలోను, ఆచరణలోనూ ఇంగ్లీషు వాళ్ళని అనుకరిస్తున్నాయి. మన మూలాల్ని మనం కోల్పోయాము. భావదారిద్రం ఈ దేశాన్ని ఆవహించింది.

ఎంతదూరం పయనించినా, ఎంత కష్టపడినా, అనుకరించేవారు ఎప్పుడూ వెనుకబడే ఉంటారు, ఇతరుల నుండి నేర్చుకోవటం తప్పు కాదు, ప్రతి ఒక్కరిలోను ఎంతో కొంత మంచి ఉంటుంది, నేర్చుకునే విషయాలు ఉంటాయి, కానీ ఆ క్రమంలో మన వివేకాన్ని తాకట్టు పెట్టకూడదు, మన మూలాల్ని తెంచుకోకూడదు. వివేకాన్ని కోల్పోయి గుడ్డిగా అనుకరించటానికి పోటీ పడితే మొదటికే మోసం వస్తుంది.

ఇంగ్లీషు భాషని నేర్చుకోండి. ఇంగ్లీషు వాడు చెప్పింది అర్ధం చేసుకుని వాడికి బదులు ఇవ్వటానికి మాత్రమే ఇంగ్లీషు కావాలి. కానీ స్వతంత్రంగా ఆలోచించటానికి, స్వతంత్రమైన వ్యక్తిత్వానికి, స్వతంత్రంగా జీవించటానికి మాతృభాష కావాలి. ఆంగ్ల భాష నేర్చుకోవటం తప్పు కాదు, పరాయి భాష పరాయి మనుషులతో కనెక్ట్ అవటానికి, భావాలని పంచుకోవటానికి ఉపకరించటానికే కానీ మన మూలాల్ని తెంచేదిగా, మన పునాదుల్ని కూల్చేదిగా ఉండకూడదు. పరాయి భాష మోజులో పడి మన వేర్లని మనం తెంచుకోకూడదు. మన ఆధారాన్ని కోల్పోతే మనం ఇతరులకు బానిసలుగా, ఇతరుల మీద పరాన్నజీవుల్లా బతకవలసిన దుస్థితి వస్తుంది. మన మూలాల్ని గుర్తెరిగి, కాపాడుకుంటేనే మనం నిలబడగలుగుతాం, ఆనందంగా ఉన్నతంగా జీవించగలుగుతాం.

చివరిగా ఒక్కమాట. తెలుగు మాధ్యమంలో చదువుకుని స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో జీవించమంటే, పాశ్చాత్యుల మీద, ఇంగ్లీషు భాష మీద ద్వేషం పెంచుకొమ్మని కాదు, వాళ్ళని శత్రువులుగా చూడమని కాదు. నిజానికి ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్లకి ఇతరుల మీద ద్వేషం ఉండదు. ద్వేషం, కక్షలు, కార్పణ్యాలు ఆత్మన్యూనతకు చిహ్నాలు. మాతృభాషలో విద్యాబోధన ఒక్క తెలుగు ప్రాంత వాసులకే కాదు. ఇది ప్రతి రాష్ట్రము వారు, ప్రతి దేశం  వారు అనుసరించాల్సిన పద్దతి. దానివలన మానవ మేధస్సు నిజంగా పరిమళిస్తుంది, ప్రపంచ శాంతి నెలకొంటుంది. ఇక విదేశాల్లో ఉద్యోగాల సంగతికి వెళ్దాం.

ఆంగ్లంలో ఉన్నత విద్య

కొంతమంది అడగవచ్చు, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివితే, మెడికల్ కాలేజీలోనో లేక యూనివర్సిటీలోనో ప్రవేశించిన తరువాత మొత్తం అంతా ఇంగ్లీషులో చదవాలంటే కష్టం కదా? అని. ఈ వాదన కొంతవరకు నిజమే. కానీ మనం నాణేనికి మరో వైపు కూడా చూడాల్సి ఉంది. అదేంటంటే తెలివైన విద్యార్థులకు నిజంగా మీడియం అనేది పెద్ద సమస్య కాదు. వాళ్ళు చిన్నప్పటి నుండి ఇంగ్లీషు మీడియంలో చదవగలరు. లేదా చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదివి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీషు మీడియంకి ఎడ్జస్ట్ (adjust) అవగలరు,

కానీ మాతృభాషలో విద్యా బోధన లేకపోతే యావరేజ్ (average) మరియు బీలో యావరేజ్ (below average) స్టూడెంట్స్ నష్టపోతారు. తెలుగు మీడియం పుణ్యమా అని ఇప్పుడు వాళ్ళు కనీసం ఇంటర్ వరకు అయినా చదవ గలుగుతున్నాడు. అదే లేకపోతే చాలా మంది ప్రాధమిక స్థాయిలోనే  ఆగిపోయ్యే ప్రమాదం ఉన్నది. అఫ్ కోర్స్, మన టీచర్స్ అలా ఆగిపోనివ్వరు అనుకోండి. పిల్లల మీద జాలితో కొంత, ప్రభుత్వానికి స్కూల్ పెర్ఫార్మన్స్ బాగున్నట్లు చూపించాలనే తాపత్రయంతో కొంత, మన టీచర్స్ పిల్లలందర్నీ ఏదోలా మంచి మార్కులతో పాస్ చేస్తారు. కానీ అది వాపే కానీ బలుపు కాదని గ్రహించాలి.

మరో విషయం ఏంటంటే, మనం ఇంగ్లీషుని ఒక తప్పనిసరి (compulsary) సబెక్టుగా చిన్నప్పటి నుండి చదువుతాము. వ్యాకరణంతో పాటు, షేక్‌స్పియర్ లాంటి మహా మహా రైటర్స్ రాసిన కష్టమైన ప్రోజ్,ఇంకా పోయెట్రీ  చదువుతాం. కనుక పదవ తరగతి, ఇంటర్మీడియేట్ వచ్చేసరికి పిల్లలందరూ షేక్‌స్పియర్లు కాకపోయినా, సింపుల్ ఇంగ్లీషు వాక్యాలను అర్ధం చేసుకునే కనీస ప్రావీణ్యం సంపాదిస్తారు. ఇంకా ఆ వయస్సు వచ్చేసరికి పిల్లలకు కొంత మానసిక పరిపక్వత (mental maturity) వస్తుంది.

కనుక పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సైన్సు, ఎకనామిక్స్, హిస్టరీ లాంటివి ఇంగ్లీషులో చదివి అర్ధం చేసుకోవటం అంత కష్టం కాకూడదు. అవి చాలా సింపుల్ టెన్స్ లో, సరళమైన భాషలో ఉంటాయి. వాటిని చదవటానికి ఇంగ్లీషు మీద విపరీతమైన పట్టు అవసరం లేదు. కాకపోతే కొంచం పదజాలం (vocabulary) మెరుగు పరుచుకోవాల్సి ఉంటుంది, అంతే. పదేళ్లకు కూడా ఆ మాత్రం ఇంగ్లీషు పరిజ్ఞానం రాలేదంటే, ఉపాధ్యాయులన్నా సరిగా చెప్పట్లేదు లేదా మన పిల్లలకు అంత ప్రతిభ లేదని, వాళ్ళు చదువుల్లో రాణించలేరని అనుకోవాలి.

అఫ్ కోర్స్ చదువు రానంత మాత్రాన పిల్లలకు ప్రతిభ లేదని కాదు, వాళ్ళు పనికిరారని కాదు. If you judge a fish by its ability to climb a tree, it will live its whole life thinking that it is stupid. అంటే చెట్టు ఎక్కే సామర్ధ్యాన్ని బట్టి ఒక చేప పిల్ల ప్రతిభని నిర్ణయిస్తే, అది తన జీవితమంతా తను ఒక పనికిరాని చవటననే భ్రమలోనే బతుకుతుంది. చెట్టు ఎక్కలేని జీవులన్నీ చవటలు కాదు. కొన్నిటికి ఈదటంలో ప్రతిభ ఉంటుంది. అలానే చదువు రాని పిల్లలందరూ చవటలు కాదు. ప్రతి ఒక్కరిలోనూ సహజ సిద్దమైన ప్రతిభ ఎదో ఒకటి ఉంటుంది. చదువుల్లో రాణించనంత మాత్రాన పిల్లలకు తెలివి తేటలు, ప్రతిభ లేవని కాదు. ప్రపంచంలో ఎంతోమంది గొప్ప మేధావులు, శాస్త్రవేత్తలు, కళాకారులు, వ్యాపారవేత్తలు చదువుల్లో రాణించలేదు. ఇంకా ఎంతో మంది ఎంట్రప్రెన్యూర్స్ తమ చదువుల్ని కట్టిపెట్టి తమకి ఆసక్తి ఉన్న రంగంలోకి దూకి, ప్రపంచానికి తమ సత్తా చాటారు.

నిజానికి మనుషులు అందరూ, తమ ఆసక్తులను పక్కనపెట్టి, చదివి డిగ్రీలు తెచ్చుకుంటే, మానవ జాతి ఎప్పుడో పూర్తిగా నిర్వీర్యం అయిపోయేది. మన మూస చదువుల వల్ల ఎంతో మానవ మేధస్సు వృధా అవుతుందంటే అతిశయోక్తి కాదు. గొప్పగా ఎదగాలంటే ముందు మన గురించి మనం తెలుసుకోవాలి, మన పరిస్థితుల్ని అంచనా వేసుకోవాలి. మన ఆసక్తి ఏంటో మనం గ్రహించాలి. మనకు దేనిమీద ఆసక్తి ఉంటే అందులో మనకు మంచి ప్రతిభ కూడా ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రులు అది గ్రహించి ముందుకు వెళ్ళాలి. అంతే కానీ గుడ్డిగా, అందరూ చదువుకుంటున్నారు, లేదా ఎదో చేస్తున్నారు కనుక మనమూ అలానే చదవాలి, అలానే చెయ్యాలి అనుకుంటే మనకి మనమే ద్రోహం చేసుకున్నవాళ్ళం అవుతాం.

అవును నిజమే, కొంతమంది విద్యార్థులకు ఇంటర్ వరకు తెలుగు మాధ్యమంలో చదివి, తరువాత ఉన్నత విద్య ఇంగ్లీషు మాధ్యమంలో చదవటం కష్టంగానే ఉండవచ్చు. దానికి సమాధానం తెలుగు వారందరు చిన్నప్పటి నుండి ఇంగ్లీషు మాధ్యమంలో చదవటమేనా? వేరే మార్గం లేదా? అసలు ఉన్నత విద్యని తెలుగు మాధ్యమంలో ఎందుకు చదవకూడదు? ఆలా మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదు? మన విద్యావ్యవస్థని ఎందుకు సంస్కరించకూడదు?