Tag Archives: TELUGU

మేధావులారా ఆలోచించండి!

తెలుగు ప్రజలకు ఇంగ్లీషు విద్యా హక్కుని ప్రసాదించి, వాళ్లకు తెలుగులో చదువుకునే హక్కుని కాలరాస్తుంది మన ప్రభుత్వం. పది కోట్ల మందికి పైగా మాట్లాడుకునే తెలుగు భాషకు తెలుగు గడ్డపైనే ఇంతటి దుర్గతి పట్టడం నిజంగా చాలా దురదృష్టం. మన ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్యమం తొలగించి ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెట్టే నిర్ణయం నిజంగా తెలుగు జాతికి సమాధి కట్టడమనే అని చెప్పాలి. కుహనా మేధావుల వలన, స్వార్ధ రాజకీయ నాయకుల వలన, రాజకీయ దురభిమానుల వలన ఈనాడు మన తెలుగు జాతి నిర్వీర్వం అవుతుంది. తెలుగు ప్రజలు ఇకనైనా మేలుకోవాలి.

ధనవంతుల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతుంటే పేదవాళ్ల పిల్లలు తెలుగు మీడియంలో చదవాలా?అంటూ పదే పదే అరిగిపోయిన రికార్డులా అరిచి గీపెట్టే మన మేధావుల అమాయకత్వానికి నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. చాలామంది ధనవంతుల ఇళ్లలో, బాగా చదువుకున్న వాళ్ళ ఇళ్లలో, పిల్లలకు అమ్మలు పాలిచ్చి పెంచే పరిస్థితి లేదు. ధనవంతుల పిల్లలు డబ్బాపాలు తాగుతున్నారని, పేద పిల్లల్ని తల్లి పాలకి దూరం చేసి, వాళ్ళకి కూడా డబ్బాపాలు పట్టడం ఎంతవరకు వివేకం? పేదలకు డబ్బా పాల హక్కుని ప్రసాదించి, డబ్బా పాల కోసం ధనవంతులు కట్టే పన్నుల మీద ఆధారపడేలా చేయటం వలన పేదలను ఉద్దరించినట్లా లేక వాళ్ళని మరింత దిగజార్చినట్లా? మన మేధావులు ఆలోచిస్తే మంచిది.

పేద పిల్లలు ప్రతి విషయంలోను ధనవంతుల పిల్లల్ని అనుకరించడానికి, వాళ్లతో పోటీ పడటానికి ధనవంతుల పిల్లలేమి ఆదర్శవంతమైన జీవితం గడపట్లేదు. ప్రభుత్వ విధానాలు రూపకల్పన చేసేటప్పుడు సమాజ శ్రేయస్సుని, శాస్త్రీయతని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాని గుడ్డిగా ధనవంతులు పలనా మార్గంలో ఉన్నారు కాబట్టి, ప్రజలందరినీ అదే దారిలో వెళ్ళమని చెప్పటం అవివేకం, దుర్మార్గం. మాతృభాషలో విద్యాబోధన పిల్లల మానసిక వికాసానికి మంచిది, సృజనాత్మకత, క్రియేటివిటీ మెరుగ్గా ఉంటుంది. దానివలన మనుషుల ఆలోచనలు ‘కాపీ అండ్ పేస్ట్’ లా కాకుండా ఒరిజినల్ గా, అసలు సిసలుగా ఉంటాయి. కనుక పిల్లలకు మాతృభాషలో విద్యాబోధన ఎంతైనా అభిలషణీయం. కనీసం పదవతరగతి వరకైనా తెలుగు మాధ్యమం ఉండాలి.

ఇంగ్లీషు మీడియం ధనవంతుల పిల్లలకేనా, పేద పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకోకూడదా అంటూ ప్రశ్నించే మేధావులు అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీషు మీడియం ధనవంతుల పిల్లలకూ మంచిది కాదు, పేద విద్యార్థులకు అంతకన్నా మంచిది కాదు. ఇంగ్లీషు మీడియం వలన ధనవంతుల పిల్లల కంటే పేద పిల్లలకే ఎక్కువ అనర్ధం. ఉదాహరణకు, నేను ఒక పేద రైతు కుటుంబం నుండి వచ్చాను. చిన్నప్పుడు అసలు బడికి వెళ్లాలంటేనే భయం. నాకే కాదు అది సహజంగా పిల్లలకు చాలా మందికి ఉంటుంది. ఇంగ్లీషుని ఒక సబ్జెక్టుగా చదవటానికే చాలా మంది పిల్లలకు ఒక ఫోబియా. మరి మొత్తం చదువు ఇంగ్లీషులో చదవటం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. బడికి వెళ్లాలంటే భయం. పైగా ఇంగ్లీషులో చదవాలి. ఇంటి దగ్గర ఇంగ్లీషు వాతావరణం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో నేను నిజంగా చదువు కొనసాగించ గలిగేవాడినా?

తెలుగు మీడియం కాబట్టి తట్టుకొని ఎలాగోలా నిలబడగలిగాను, నిదానంగా చదువు మీద ఆసక్తి వచ్చింది, ‘స్పూన్ ఫీడింగ్’ చదువులు కాదు కాబట్టి మానసిక పరిపక్వత వచ్చింది. చదువు మీద ఆసక్తి, మానసిక పరిపక్వత వచ్చిన తరువాత ఇక మీడియం అనేది పెద్ద సమస్య కాదు. టెన్త్ తరవాత ఇంటర్ ఇంగ్లీషు మీడియంలో చదవటం నాకు సమస్యగా అనిపించలేదు. నేను మంచిగా చదువులో నిలబడటానికి ఖచ్చితంగా తెలుగు మీడియం దోహద పడిందని చెప్పాలి. కానీ నా పిల్లలకు ఇంగ్లీషు మీడియం అంత సమస్య కాదు. ఎందుకంటే ఇంట్లో ఎంతో కొంత ఇంగ్లీషు వాతావరణం ఉంటుంది, దానికి తోడు, మంచో చెడో, కొంత ‘స్పూన్ ఫీడింగ్’ ఉంటుంది స్కూల్లోనూ, ఇంట్లోనూ. కనుక మానసిక వికాసం సంగతి దేవుడెరుగు గానీ, చదువులు మాత్రం ఎలా గోలా కంటిన్యూ చేయగలుగుతారు. కానీ పేద పిల్లలకు ఇంట్లో ఇంగ్లీషు వాతావరణం ఉండదు, స్కూల్లో ‘స్పూన్ ఫీడింగ్’ ఉండదు. కనుక వాళ్ళు ఇంగ్లీషు మీడియం వలన ఖచ్చితంగా ఎక్కువ ఇబ్బంది పడతారు. ఉపాధ్యాయుల ద్వారా మేము కూడా అదనపు శిక్షణ, ‘స్పూన్ ఫీడింగ్’  ఇప్పిస్తామనోచ్చు ప్రభుత్వం వారు. కానీ తెలుగు మీడియంలోనే అంతంత మాత్రం చదువు చెప్పే మన ప్రభుత్వ టీచర్స్, ఇంగ్లీషు మీడియంలో ఇరగ బొడుస్తారనుకోవటం అవివేకం అవుతుంది.

ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం వలన నూటికి ఒకళ్ళో ఇద్దరో లేదా పది మందో లాభపడితే లాభపడవచ్చు, మానసిక వికాసం లేకపోయినా నాలుగు ఇంగ్లీషు ముక్కలు మాట్లాడటం ద్వారా మంచిగా కెరీర్లో ముందుకెళ్ళవచ్చు. కానీ వాళ్ళ కోసం పిల్లలందరినీ ఇంగ్లీషు సవతి తల్లికి అప్పజెప్పటం, బలిచేయటం ఎంతవరకు భావ్యం? సవతి తల్లి ఇచ్చే చాకోలెట్స్ కి అలవాటు చేసి, పిల్లలను కన్నతల్లికి దూరం చేయటం ఏరకంగా సమర్ధనీయం?

ప్రభువులకు సమాజాభ్యుదయం మీద నిజంగా చిత్తశుద్ధి, స్పృహ ఉంటే, ఇంగ్లీషు మాధ్యమంలో చదివే కోటీశ్వరుల పిల్లలు కూడా తెలుగు బడుల్లో చదివేలా ప్రోత్సహించాలి. అందుకు అవసరైమైన చర్యలు తీసుకోవచ్చు. అది కోటీశ్వరుల పిల్లలకూ మంచిది, సమాజానికీ మంచిది. అంతేకాని ధనికులు ఆంగ్లమాధ్యమంలో చదువుతున్నారు కాబట్టి అదేదో గొప్పని భావించి, పిల్లల మనోవికాసం గురించి కనీస స్పృహ లేకుండా, పేదలకు కూడా తెలుగు మాధ్యమం అవకాశాన్ని దూరం చేయటం మన ప్రభువుల, మన ‘సంఘసంస్కర్తల’ అవివేకాన్ని చాటుతుంది.

అవును ప్రజలు ఆంగ్లమత్తులో తూగుతున్నారు, అదే గొప్పని భ్రమ పడుతున్నారు. దాని కోసం తహతహ లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని తెలుగు అనే వెలుగు వైపు ఎలా నడిపించడం? తెలుగు సమాజాన్ని, సంస్కృతిని ఎలా కాపాడటం? తుప్పు పట్టిన మూస ఆలోచనా ధోరణి నుండి బయటకు వచ్చి నిష్కర్షగా, లోతుగా ఆలోచిద్దాం.

తెలుగు తల్లి ఆవేదన

“తెలుగు నేలపై ఆంగ్లానికి పట్టం కడుతున్న తెలుగు ప్రభువులకు, తెలుగు మేధావులకు, తెలుగు బిడ్డలకు ఆర్తితో, ఆవేదనతో తెలుగు తల్లి రాస్తున్న బహిరంగ లేఖ.

ముందుగా… తెలుగు మాట్లాడటం, తెలుగు చదువుకోవటం మీకు వెనుకబాటుతనం ఐనప్పటికీ, మీ రంగురంగుల ఆంగ్ల బడుల్లో తెలుగుని ద్వితీయ భాషగా కొనసాగిస్తున్నందుకు, తెలుగుని ఒక పాఠ్యంశంగా చదువుతున్నందుకు కృతఙ్ఞతలు. మాతృభాషను మృతభాష కాకుండా కాపాడటానికి తూతూమంత్రంగా అయినా మీరు చేపట్టే చర్యలకు నిజంగా ధన్యవాదాలు.

కానీ ఇక్కడ నాదొక విన్నపం. అదేంటంటే మీరెవరూ నన్ను కాపాడటానికో లేదా నన్ను ఉద్దరించడానికో తెలుగు చదవవద్దు. మీరు తెలుగు చదువుకోవాలనుకుంటే కేవలం మీ ఆనందం కోసం, మీ హితం కోసం మాత్రమే చేయండి. అంతేకాని నన్ను రక్షించాలని మాత్రం చేయవద్దు.

ఎందుకంటే మహాభారతాన్ని ఆంధ్రీకరించి కవిత్రయంగా వాసికెక్కిన నన్నయ, తిక్కన మరియు ఎఱ్ఱాప్రెగడలు; ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన సహజకవి పోతనామాత్యుడు; ఆపై రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవయిత్రి మొల్ల మొదలగు వారు తమ కవితా పాండిత్యంతో నన్నెప్పుడో చిరంజీవిని చేశారు. ఆ మహాకవుల ద్వారా లభించిన భగవత్స్పర్శతో నేనెప్పుడో పునీతమయ్యాను.

అలానే అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు లాంటి వాగ్గేయకారుల భక్తిపారవస్యం నుండి జాలువారిన తియ్యని కీర్తనలు నన్నెప్పుడో పావనం చేసాయి. ఇంకా వేమన పద్యాలూ, సుమతీ శతకాలు మొదలగు పద్య సంపుటాలు సరళమైన పదాలలో అపారమైన జ్ఞానసంపదని నాలో నిబిడీకృతం చేసి నన్ను ఎంతగానో సంతుష్టం గావించాయి. అలానే కవిసార్వభౌమ శ్రీనాధుడు, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు, అష్టదిగ్గజాలుగా పేరొందిన అల్లసాని పెద్దన, ధూర్జటి, తెనాలి రామలింగడు.. ఇత్యాదులు; ఇంకా పాల్కురికి సోమనాధుడు నుండి పరవస్తు చిన్నయసూరి వరకు, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ నుండి కవికోకిల గుర్రం జాషువా వరకు… ఇలా ఎందరో మహానుభావులు తమ తమ శైలుల్లో అపారమైన పాండిత్యాన్ని పండించి నాకు ఎంతో విశిష్టతని చేకూర్చారు. ఆపైన ఎందరో ఆధునిక కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు, సంగీతకారులు, గాయనీగాయకులు తమ తమ ప్రజ్ఞాపాటవాలతో నన్ను ఓలలాడించారు, నాలో వినూత్నమైన సాహిత్యాన్ని పండించి నన్ను పరిపూర్ణం చేసారు.

కనుక మీరు నా గురించి బెంగపడవద్దు. మీరు తెలుగు చదివినా, చదవకపోయినా, నా మాతృమూర్తి అయిన సంస్కృతంలా నేను కూడ ఈ భూప్రపంచంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాను. పరాయి సంస్కృతి మోజులో తూగుతున్న మీ చేత కాపాడబడవలసిన అగత్యం మీ తల్లికి లేదు. కనుక మీ కంటితుడుపు చర్యలు, కపట నాటకాలు కట్టిపెట్టి మీకు నచ్చిన ఇంగ్లీషు భాషలోనే మీ చదువులు వెలగబెట్టండి. నాకెటువంటి అభ్యంతరమూ లేదు.

కానీ మీ శ్రేయస్సు కోరి ఒక్కమాట..

తెలుగులో చదువుకుంటే వృద్ధిలోకి రాలేము, తెలుగు భాష జీవనోపాధిని ఇవ్వలేదు అని నాపై అపవాదు వేయకండి. నాపై అబద్దపు ప్రచారం చేసి మాతృహత్యా పాతకం మూటకట్టుకోవద్దు. ఇంగ్లీషు పైత్యం మీరు తలకెక్కించుకోవటానికి పూర్వం, ఈ తెలుగు గడ్డ మీద ప్రజలు మీ ఇంగ్లీషు తరం వారి కంటే ఎన్నో రెట్లు ఆనందంగా, ప్రశాంతంగా జీవించారు. మీకంటే ఎంతో ఉన్నతంగా, పర్యావరణ హితంగా జీవించారు. ఇప్పుడు కూడా మీరు నిజంగా తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని నమ్ముకుంటే, ఖచ్చితంగా ఉన్నతంగా, ఆనందంగా జీవించగలుగుతారు.

కానీ పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి, అన్నింటా పాశ్చాత్యులను అనుకరిస్తూ; వివేకాన్ని, సృజనాత్మకతని కోల్పోయిన మీకు ఆంగ్లం లేకపోతే ముద్ద దొరకదు అనిపిస్తుంది. ఇంకా నాగరికత భ్రమలో వికృత జీవనశైలికి, వ్యసనాలకు బానిసలైన మీకు అమ్మభాష అంటే చిన్నతనం. సంపాదనే ధ్యేయంగా ఇంగ్లీషు చదువులు వెలగబెడుతున్న మీకు అమ్మ ప్రేమలోని కమ్మదనం, అమ్మ భాషలోని తియ్యదనం ఎలా తెలుస్తుంది? సంపాదన యావతో, విలువలు నేర్పని పట్టాల కోసం అమ్మభాషనే కాదు, కన్నవారిని కూడా గాలికి వదిలేస్తారు. చివరికి కట్టుకున్న వాళ్ళని, కన్న పిల్లల్ని కూడా దూరం చేసుకుని దుర్భరమైన జీవితాలు గడుపుతారు. ‘మేడిపండు చూడ మేలిమైయుండు పొట్ట విప్పిచూడ పురుగులుండు’ అన్న చందంగా మీరు పైకి సూటు బూటు వేసుకుంటారు, కానీ లోపలంతా అసంతృప్తి, అల్లకల్లోలమే. పాపం మీ పైపై మెరుగులు, హంగులు, ఆర్భాటాలు చూసి మంచిగా, ప్రశాంతంగా, అన్యోన్యంగా జీవించే అమాయక ప్రజలు కూడా దురదృష్టవశాత్తు ఇంగ్లీషు చదువులకు ఎగబడుతున్నారు. మిమ్మల్ని అనుకరించి వాళ్ళూ తమ బతుకుల్ని దుర్భరం చేసుకుంటున్నారు.

ఆధునికత మోజులో వివేకం కోల్పోయి, పరుగులు తీస్తున్న మీకు ఈ నా రోదన చెవిటివాడి ముందు శంఖం ఊదటం లాంటిదే. కానీ కుటుంబాలు విచ్చిన్నమై, అయినవాళ్లెవరూ దగ్గర లేక, చివరకి దిక్కుతోచని స్థితిలో మీరు ఎదో ఒకరోజు ఈ మాతృమూర్తిని తలచుకోకపోరు. పరభాష, పరసంస్కృతి పీడితులై, బాధాతప్త హృదయులైన మిమ్మల్ని అక్కున చేర్చుకుని, స్వాంతన చేకూర్చటానికి ఈ తెలుగు తల్లి జీవించే ఉంటుందని గుర్తుపెట్టుకోండి.”

రాజకీయ క్రీడలో తెలుగు భాష