Category Archives: TELUGU

తెలుగులో ఉన్నత విద్యాభ్యాసం

ఆంగ్లంలో చదువుకోడానికి అలవాటు పడిన మన ఆధునిక సమాజానికి తెలుగు మాధ్యమంలో ఉన్నత విద్య అనే ఆలోచనే చాలా వింతగా తోస్తుంది. చాలా మందికి అసంబద్ధంగాను అనిపించవచ్చు. ముందు తెలుగు సమాజం ఈ తరహా కొయ్యబారిన మనస్తత్వం నుండి బయట పడాలి. అవును ఉన్నత విద్యని, ఉన్నపళంగా ఒక్కసారిగా తెలుగులో బోధించటం కష్టంగానే ఉండవచ్చు. కానీ చిత్తశుద్ధితో, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే అది అంత అసాధ్యమైన విషమేమి కాదని తెలుస్తుంది. ఇంకా, అనతి కాలంలోనే అద్భుతమైన ఫలాల్ని ఆస్వాదించవచ్చు. వివరాల్లోకి వెళ్లే ముందు, మాతృభాషలో విద్యా భ్యాసం వలన ప్రయోజనాలు ఏంటో ఒకసారి నెమరు వేసుకుందాం.

ముందుగా, పిల్లలు ఇంగ్లీషు భయం లేకుండా చదువుకోగలుగుతారు. ఉపాధ్యాయులు చెప్పేది బాగా అర్ధం చేసుకోగలుగుతారు. మరియు పుస్తకాల్లో ఉన్న విషయాలని మంచిగా గ్రహించగలుగుతారు. బడిలో నేర్చుకున్న వాటిని ఇంట్లో, సమాజంలో, పరిసరాల్లో తాము గమనించే విషయాలతో మంచిగా అన్వయించుకోగలుగుతారు. అలా పిల్లల మేధస్సు వికసిస్తుంది. విశ్లేషణ శక్తి మెరుగవుతుంది. మానసిక పరిపక్వత తొందరగా వస్తుంది. తరువాత, విద్యార్థులు కేవలం పరాయి ఆలోచనలను నిష్క్రియాత్మకంగా (పాసివ్) తలకెక్కించుకోకుండా, వాళ్ళు స్వంతంగా ఆలోచించగలుగుతారు. ప్రతి దాన్ని పాశ్చాత్యుల నుండి దిగుమతి చేసుకోకుండా, పాశ్చాత్యులను అనుకరించకుండా శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వంతంగా ఆవిష్కరణలు చేయగలుగుతారు. ఇంకా మాతృభాషలో పిల్లలు భావవ్యక్తీకరణ మంచిగా చేయగలుగుతారు. కనుక పిల్లలు సామాజికంగా ఉన్నతంగా ఎదుగుతారు. సమాజాభ్యుదయం జరుగుతుంది. చివరిగా, తెలుగు భాషని, సంస్కృతిని నిలబెట్టిన వాళ్ళం అవుతాం, భావితరాల వారికి విలువైన సంస్కృతిని, జ్ఞానాన్ని అందించగలుగుతాం.

శరీరధర్మ శాస్త్రం ప్రకారం మానవుల సంగ్రహణ శక్తి, విశ్లేషణా శక్తి పదిహేను నుండి ఇరవై సంవత్సరాల లోపు అత్యధిక స్థాయిలో ఉంటుంది. ఆంగ్లంలో విద్యా బోధన వలన అత్యంత కీలకమైన వయస్సంతా పర భాష మీద పట్టు సంపాదించటానికే అంకితమవుతుంది, ఎదుటివాళ్ళు ఏమి చెప్తున్నారో గ్రహించటానికే అర్పితమవుతుంది, కనుక చాలా మంది పిల్ల్లలు తమ మేధాశక్తికి పదును పెట్టే అవకాశాన్ని కోల్పోతారు, వాళ్లలో సృజనాత్మకత కొరవడుతోంది. పుస్తకాల్లో రాసినవి మూసగా అప్పచెప్ప గలుగుతారు కానీ స్వంతంగా ఆలోచించలేరు. నూతన ప్రతిపాదనలు చేయలేరు. స్వంతగా ఆవిష్కరణలు చేయలేరు. దానికి తోడు ఇంట్లో ఒక భాష, బడిలో ఒక భాష మూలంగా మెదడులో ఒక రకమైన భాషా పరమైన సంఘర్షణ తలెత్తుతుంది. చదువుకుని నేర్చుకున్న విషయాలకు, బయట గ్రహించే విషయాలకు మధ్య సమన్వయము లోపిస్తుంది. మానసిక వికాసం దెబ్బతింటుంది. విశ్లేషణా శక్తి మీద ప్రభావం చూపుతుంది. కనుక పరభాషలో విద్యాబోధన వలన విద్యార్థులు శాస్త్ర పరమైన, సాంకేతిక పరమైన అంశాల గురించి లోతుగా, స్వతంత్రంగా ఆలోచించలేరు.

తరువాత, ఉన్నత విద్య కేవలం సాంకేతిక పరిజ్ఞానం తలకెక్కించుకుని నిద్రపోటానికి కాదు లేదా విదేశీయులకి ఊడిగం చేసి డబ్బులు మూటలు కట్టుకోవటానికి కాదు. అది సమాజానికి ఉపయోగపడాలి, సామాన్య ప్రజలకు మేలు జరగాలి. ఉన్నత విద్య ద్వారా సంపాదించుకున్న జ్ఞానఫలాలు ప్రజలకు చేరాలి. అది మాతృభాషా ద్వారానే మంచిగా సాధ్యపడుతుంది. మాతృభాషలో చదువుకుంటే డాక్టర్లు, ఇంజినీర్లు చదువు అవగానే అమెరికా పరిగెత్తకుండా ఇక్కడే ఉండి సేవ చేస్తారు. ఇంకా, వైద్య విద్య తెలుగులో చదువుకుంటే, మన వైద్యులు ఇక్కడి రోగులతో, బంధువులతో బాగా మాట్లాడగలుగుతారు. వాళ్లకు బాగా అర్ధం అయ్యేలా చెప్పగలుగుతారు. అలానే లాయర్లు, కలెక్టర్లు. ఇంజినీర్లు కూడా. ఇంకా సాఫ్ట్ వేర్ విద్య తెలుగులో చదుకున్నట్లయితే, ఈ పాటికి తెలుగు భాషకి, కంప్యూటర్ రంగానికి మంచిగా అనుసంధానం జరిగి ఉండేది.

ఉన్నత విద్య ఇంగ్లీషులో ఉందని, దాని కోసం వ్యవస్థనంతా మార్చేసి, పిల్లలందరినీ మాతృభాషకు దూరం చేయటం అవివేకం. అది నాడా కోసం గుర్రాన్ని వదిలేసిన చందంగా ఉంటుంది. పిల్లల్లో సృజనాత్మకత, మానసిక వికాసం క్షీణింపజేసి, వాళ్లకి ఉన్నత విద్య ప్రసాదించడం వలన, సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. కనుక ప్రాధమిక విద్యని ఇంగ్లీషులోకి మార్చి, తెలుగు సంస్కృతిని, తెలుగు సమాజం మూలాల్ని పెకలించడం కన్నా, ప్రాధమిక విద్యని తెలుగులోనే యధాతధంగా ఉంచి, ఉన్నత విద్యకి సంబంధించిన గ్రంధాలను తెలుగులోకి తర్జుమా చేయించి, ఉన్నత విద్యని కూడా తెలుగులో అందించడం ఎంతైనా సహేతుకం. ఇంకా, కేవలం తెలుగులో చదువులు కొనసాగించే అవకాశం లేక మరియు ఇంగ్లీషు భాష నేర్చుకోలేక కొంతమంది తెలివైన పిల్లలు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారనేది వాస్తవం. కనుక మాతృభాషలో ఉన్నత విద్యని అందించటం వలన ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నత విద్యని అభ్యసించే అవకాశం ఉంటుంది.

అవును ఉన్నత విద్యని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా తెలుగులో బోధించటం కష్టంగానే ఉండవచ్చు. కానీ చిత్తశుద్ధితో, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే అది అంత అసాధ్యమైన విషమేమి కాదని తెలుస్తుంది. ముందుగా మన ఆచార్యులు తమ తెలుగు భాష పరిజ్ఞానాన్ని కొంత పెంపొందించుకోవాల్సి ఉంటుంది. తెలుగు మాట్లాడే ఆచార్యులకు నిజంగా అది అంత కష్టమైన విషయం కాదు. తెలుగులో పాఠాలు చెప్పే మన ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి ఇంగ్లీషులో పాఠాలు చెప్పించటం కంటే, ఇంగ్లీషులో పాఠాలు చెప్పే మన యూనివర్సిటీ ఆచార్యులకు శిక్షణ ఇచ్చి, వాళ్ళ చేత తెలుగులో పాఠాలు చెప్పించటం చాలా తేలిక.

తరువాత, ఉన్నత విద్యకి సంబంధించిన పుస్తకాలను ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ప్రతి రంగంలో కొంతమంది నిపుణుల్ని తర్జుమా సహాయకులుగా నియమించుకోవచ్చు. అదొక ఉపాధిగా కూడా ఉపయోగ పడుతుంది. కొంత సాఫ్ట్ వేర్ సహకారం ఎలాగూ ఉన్నది. చిన్న చిన్న దేశాలు కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, విశ్వవిద్యాలయాల్లో బోధించే ఉన్నత గ్రంధాలను తమ తమ భాషల్లోకి తర్జుమా చేసుకోగలిగినప్పుడు, తెలుగు భాషలోకి ఎందుకు చేయకూడదు? కనుక తెలుగులో ఉన్నత విద్యాభ్యాసం అంత దుర్లభమైన విషమేమికాదు.

కొద్దికాలంలోనే, మాతృభాషలో విద్యాభ్యాసం వలన పిల్లల సృజనాత్మకత మెరుగవుతుంది. కేవలం పరాయి ఆలోచనలను నిష్క్రియాత్మకంగా (పాసివ్) తలకెక్కించుకోకుండా, వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించగలుగుతారు. ప్రతి దాన్ని పాశ్చాత్యుల నుండి దిగుమతి చేసుకోకుండా, వాళ్ళని అనుకరించకుండా శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వంతంగా ఆవిష్కరణలు చేయగలుగుతారు. వినూత్నమైన అసలు సిసలైన ప్రతిపాదనలు చేయగలుగుతారు. క్రమంగా తెలుగు జాతి మేధస్సు పరిమళిస్తుంది, మన వాళ్ళు కూడా పుస్తకాలు రాయగలుగుతారు. కొంత కాలం తరువాత మన వాళ్ళు తెలుగులో రాసిన పుస్తకాలను పాశ్చాత్యులు తర్జుమా చేసుకునే పరిస్థితి వస్తుంది.

ఇక రిఫరెన్స్ పుస్తకాలూ, జర్నల్స్… అవి నిజంగా ఎంతమందికి అవసరం? ఎంతమంది యూనివర్సిటీ చదువులు చదివే స్థాయికి వస్తారు? అంత స్థితికి వెళ్లిన వారికి కాస్తో కూస్తో ఇంగ్లీషు పరిజ్ఞానం ఉంటుంది. అది కూడా లేదనుకుంటే, కావాల్సిన వాటిని తెలుగులోకి తర్జుమా చేసే అవకాశం ఉంది. ఆ కొద్ది మంది ‘మేధావుల’ కోసం జాతి మొత్తం ఇంగ్లీషులో చదవటం ఎంత అవివేకం? అంత స్థితికి వెళ్లిన తరువాత కూడా తమంతట తాముగా నేర్చుకోలేని వాళ్ళ కోసం జాతిని నిర్వీర్యం చేయటం ఎంతవరకు సబబు? పిల్లలందరినీ సృజనాత్మక కోల్పోయేలా చేయటం ఎంత వరకు న్యాయం?

ఒకవేళ మన ప్రభువుల వారు ఉన్నత విద్యని తెలుగు భాషలో చెప్పించటం అంత కష్టమనుకుంటే, ఇప్పుడున్న పరిస్థితిని ఇలానే కొనసాగిస్తూ, పదవ తరగతి/ ఇంటర్మీడియట్ వరకు మాతృభాషలో చదువుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యలో మరియు ఉద్యోగాల్లో కొంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఆలా చేయటం ద్వారా తెలుగు జాతి నిర్వీర్యం కాకుండా కాపాడగలుగుతాం. పిల్లల్లో సృజనాత్మకతని పెంపొందించిన వాళ్లమవుతాం. తెలుగు జాతి మూలాలు కొంతైన బలపడతాయి. తెలుగు సంస్కృతి నిలబడుతుంది. భవిష్యత్తులోనైనా మన సమాజం బానిసత్వం నుండి భారతీయం వైపు పయనించి ఉన్నతంగా జీవించగలుగుతుంది.

మేధావులారా ఆలోచించండి!

తెలుగు ప్రజలకు ఇంగ్లీషు విద్యా హక్కుని ప్రసాదించి, వాళ్లకు తెలుగులో చదువుకునే హక్కుని కాలరాస్తుంది మన ప్రభుత్వం. పది కోట్ల మందికి పైగా మాట్లాడుకునే తెలుగు భాషకు తెలుగు గడ్డపైనే ఇంతటి దుర్గతి పట్టడం నిజంగా చాలా దురదృష్టం. మన ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్యమం తొలగించి ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెట్టే నిర్ణయం నిజంగా తెలుగు జాతికి సమాధి కట్టడమనే అని చెప్పాలి. కుహనా మేధావుల వలన, స్వార్ధ రాజకీయ నాయకుల వలన, రాజకీయ దురభిమానుల వలన ఈనాడు మన తెలుగు జాతి నిర్వీర్వం అవుతుంది. తెలుగు ప్రజలు ఇకనైనా మేలుకోవాలి.

ధనవంతుల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతుంటే పేదవాళ్ల పిల్లలు తెలుగు మీడియంలో చదవాలా?అంటూ పదే పదే అరిగిపోయిన రికార్డులా అరిచి గీపెట్టే మన మేధావుల అమాయకత్వానికి నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. చాలామంది ధనవంతుల ఇళ్లలో, బాగా చదువుకున్న వాళ్ళ ఇళ్లలో, పిల్లలకు అమ్మలు పాలిచ్చి పెంచే పరిస్థితి లేదు. ధనవంతుల పిల్లలు డబ్బాపాలు తాగుతున్నారని, పేద పిల్లల్ని తల్లి పాలకి దూరం చేసి, వాళ్ళకి కూడా డబ్బాపాలు పట్టడం ఎంతవరకు వివేకం? పేదలకు డబ్బా పాల హక్కుని ప్రసాదించి, డబ్బా పాల కోసం ధనవంతులు కట్టే పన్నుల మీద ఆధారపడేలా చేయటం వలన పేదలను ఉద్దరించినట్లా లేక వాళ్ళని మరింత దిగజార్చినట్లా? మన మేధావులు ఆలోచిస్తే మంచిది.

పేద పిల్లలు ప్రతి విషయంలోను ధనవంతుల పిల్లల్ని అనుకరించడానికి, వాళ్లతో పోటీ పడటానికి ధనవంతుల పిల్లలేమి ఆదర్శవంతమైన జీవితం గడపట్లేదు. ప్రభుత్వ విధానాలు రూపకల్పన చేసేటప్పుడు సమాజ శ్రేయస్సుని, శాస్త్రీయతని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాని గుడ్డిగా ధనవంతులు పలనా మార్గంలో ఉన్నారు కాబట్టి, ప్రజలందరినీ అదే దారిలో వెళ్ళమని చెప్పటం అవివేకం, దుర్మార్గం. మాతృభాషలో విద్యాబోధన పిల్లల మానసిక వికాసానికి మంచిది, సృజనాత్మకత, క్రియేటివిటీ మెరుగ్గా ఉంటుంది. దానివలన మనుషుల ఆలోచనలు ‘కాపీ అండ్ పేస్ట్’ లా కాకుండా ఒరిజినల్ గా, అసలు సిసలుగా ఉంటాయి. కనుక పిల్లలకు మాతృభాషలో విద్యాబోధన ఎంతైనా అభిలషణీయం. కనీసం పదవతరగతి వరకైనా తెలుగు మాధ్యమం ఉండాలి.

ఇంగ్లీషు మీడియం ధనవంతుల పిల్లలకేనా, పేద పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకోకూడదా అంటూ ప్రశ్నించే మేధావులు అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీషు మీడియం ధనవంతుల పిల్లలకూ మంచిది కాదు, పేద విద్యార్థులకు అంతకన్నా మంచిది కాదు. ఇంగ్లీషు మీడియం వలన ధనవంతుల పిల్లల కంటే పేద పిల్లలకే ఎక్కువ అనర్ధం. ఉదాహరణకు, నేను ఒక పేద రైతు కుటుంబం నుండి వచ్చాను. చిన్నప్పుడు అసలు బడికి వెళ్లాలంటేనే భయం. నాకే కాదు అది సహజంగా పిల్లలకు చాలా మందికి ఉంటుంది. ఇంగ్లీషుని ఒక సబ్జెక్టుగా చదవటానికే చాలా మంది పిల్లలకు ఒక ఫోబియా. మరి మొత్తం చదువు ఇంగ్లీషులో చదవటం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. బడికి వెళ్లాలంటే భయం. పైగా ఇంగ్లీషులో చదవాలి. ఇంటి దగ్గర ఇంగ్లీషు వాతావరణం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో నేను నిజంగా చదువు కొనసాగించ గలిగేవాడినా?

తెలుగు మీడియం కాబట్టి తట్టుకొని ఎలాగోలా నిలబడగలిగాను, నిదానంగా చదువు మీద ఆసక్తి వచ్చింది, ‘స్పూన్ ఫీడింగ్’ చదువులు కాదు కాబట్టి మానసిక పరిపక్వత వచ్చింది. చదువు మీద ఆసక్తి, మానసిక పరిపక్వత వచ్చిన తరువాత ఇక మీడియం అనేది పెద్ద సమస్య కాదు. టెన్త్ తరవాత ఇంటర్ ఇంగ్లీషు మీడియంలో చదవటం నాకు సమస్యగా అనిపించలేదు. నేను మంచిగా చదువులో నిలబడటానికి ఖచ్చితంగా తెలుగు మీడియం దోహద పడిందని చెప్పాలి. కానీ నా పిల్లలకు ఇంగ్లీషు మీడియం అంత సమస్య కాదు. ఎందుకంటే ఇంట్లో ఎంతో కొంత ఇంగ్లీషు వాతావరణం ఉంటుంది, దానికి తోడు, మంచో చెడో, కొంత ‘స్పూన్ ఫీడింగ్’ ఉంటుంది స్కూల్లోనూ, ఇంట్లోనూ. కనుక మానసిక వికాసం సంగతి దేవుడెరుగు గానీ, చదువులు మాత్రం ఎలా గోలా కంటిన్యూ చేయగలుగుతారు. కానీ పేద పిల్లలకు ఇంట్లో ఇంగ్లీషు వాతావరణం ఉండదు, స్కూల్లో ‘స్పూన్ ఫీడింగ్’ ఉండదు. కనుక వాళ్ళు ఇంగ్లీషు మీడియం వలన ఖచ్చితంగా ఎక్కువ ఇబ్బంది పడతారు. ఉపాధ్యాయుల ద్వారా మేము కూడా అదనపు శిక్షణ, ‘స్పూన్ ఫీడింగ్’  ఇప్పిస్తామనోచ్చు ప్రభుత్వం వారు. కానీ తెలుగు మీడియంలోనే అంతంత మాత్రం చదువు చెప్పే మన ప్రభుత్వ టీచర్స్, ఇంగ్లీషు మీడియంలో ఇరగ బొడుస్తారనుకోవటం అవివేకం అవుతుంది.

ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం వలన నూటికి ఒకళ్ళో ఇద్దరో లేదా పది మందో లాభపడితే లాభపడవచ్చు, మానసిక వికాసం లేకపోయినా నాలుగు ఇంగ్లీషు ముక్కలు మాట్లాడటం ద్వారా మంచిగా కెరీర్లో ముందుకెళ్ళవచ్చు. కానీ వాళ్ళ కోసం పిల్లలందరినీ ఇంగ్లీషు సవతి తల్లికి అప్పజెప్పటం, బలిచేయటం ఎంతవరకు భావ్యం? సవతి తల్లి ఇచ్చే చాకోలెట్స్ కి అలవాటు చేసి, పిల్లలను కన్నతల్లికి దూరం చేయటం ఏరకంగా సమర్ధనీయం?

ప్రభువులకు సమాజాభ్యుదయం మీద నిజంగా చిత్తశుద్ధి, స్పృహ ఉంటే, ఇంగ్లీషు మాధ్యమంలో చదివే కోటీశ్వరుల పిల్లలు కూడా తెలుగు బడుల్లో చదివేలా ప్రోత్సహించాలి. అందుకు అవసరైమైన చర్యలు తీసుకోవచ్చు. అది కోటీశ్వరుల పిల్లలకూ మంచిది, సమాజానికీ మంచిది. అంతేకాని ధనికులు ఆంగ్లమాధ్యమంలో చదువుతున్నారు కాబట్టి అదేదో గొప్పని భావించి, పిల్లల మనోవికాసం గురించి కనీస స్పృహ లేకుండా, పేదలకు కూడా తెలుగు మాధ్యమం అవకాశాన్ని దూరం చేయటం మన ప్రభువుల, మన ‘సంఘసంస్కర్తల’ అవివేకాన్ని చాటుతుంది.

అవును ప్రజలు ఆంగ్లమత్తులో తూగుతున్నారు, అదే గొప్పని భ్రమ పడుతున్నారు. దాని కోసం తహతహ లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని తెలుగు అనే వెలుగు వైపు ఎలా నడిపించడం? తెలుగు సమాజాన్ని, సంస్కృతిని ఎలా కాపాడటం? తుప్పు పట్టిన మూస ఆలోచనా ధోరణి నుండి బయటకు వచ్చి నిష్కర్షగా, లోతుగా ఆలోచిద్దాం.